తరుణ్ సూపర్
వన్తా (ఫిన్లాండ్): తెలుగు షట్లర్ తరుణ్ మన్నేపల్లి ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. ప్రపంచ 14వ ర్యాంకరైన టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)కు షాకిచ్చి రెండోరౌండ్కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో 46వ ర్యాంకర్ తరుణ్ 11-21, 21-11, 22-20తో పొవోవ్ను కంగుతినిపించాడు. లక్ష్య సేన్ 15-21, 17-21తో ఐదోసీడ్ కొడాయి నరకొర (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఓ టోర్నీలో ఆరంభ రౌండ్లోనే ఓడడం లక్ష్యకు ఈ ఏడాదిలో ఇది పదోసారి. కిడాంబి శ్రీకాంత్ ఆరంభ మ్యాచ్ ఆడకుండానే ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వగా.. కిరణ్ జార్జ్ 10-21, 1-4తో ప్రత్యర్థిపై వెనుకంజలో ఉన్న దశలో గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇక, శంకర్ ముత్తుస్వామి, ఆయుష్ షెట్టి ప్రత్యర్థుల చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు.
ముంబై దూకుడు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రైమ్ వాలీబాల్ లీగ్లో ముంబై మీటియర్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఢిల్లీ తుఫాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 3-0 (15-12, 15-10, 15-11)తో నెగ్గింది. ముంబై కెప్టెన్ అమిత్ గులియా, శుభం దూకుడైన ఆట తీరు ఢిల్లీ జట్టును విజయానికి దూరం చేశాయి.
Comments